Posts

Showing posts from August, 2020

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 20

త్రిమూర్తులకు మూల తత్వమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, ఒక చిన్న కంద పద్యంగా 17 వ భాగంలో చూసాం. అదే భావన మొదటి స్కంధంలో నాలుగు స్తుతి పద్యాలుగా ఎలా కనబడుతుందో చూద్దాం. ఈ నాలుగు పద్యాలు షష్ఠ్యాంతాలుగా పిలువబడే వరుస పద్యాలు. ఇవి మొదటి స్కంధంలో ఇష్టదేవతారాధన పద్యాల తరువాత వచ్చే పద్యాలు. ఇవిగో ఆ నాలుగు షష్ఠ్యాంతాలు. 1-29-ఉ హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్. 1-30-ఉ శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. 1-31-ఉ క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్. 1-32-ఉ . న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాం

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 19

విశ్వమంతటా నిండి ఉన్నవాడే విష్ణువని తెలిపే రెండు చిన్న పద్యాలు చూద్దాం. ఇలాంటి అర్ధం వచ్చే పద్యాలు చాలా ఉన్నా, ఈ భాగంలోని రెండింటికీ చాలా సామ్యమున్నది. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. రెండవ స్కంధంలో శుకమహర్షి పరీక్షిత్తు మహారాజునకు విష్ణువు యొక్క తత్వము వివరిస్తున్నాడు. విష్ణువు యొక్క విరాట స్వరూపం వివరించి తరువాత “విష్ణువు అంతటా ఉన్నాడు” అని చెప్తున్నాడు. మొదటి స్కంధమంతా ఉపోద్ఘాతమైతే, రెండవ స్కంధములోనే అసలు విషయము మొదలవుతుంది. రెండవది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. కొడుకు విష్ణుభక్తితో విసిగి పోయిన హిరణ్యకశిపుడు, “హరి ఎక్కడ కలడు?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం.  ఇవిగో పద్యాలు. 2-17-క. (శుకమహర్షి మాట)  హరిమయము విశ్వమంతయు  హరి విశ్వమయుండు సంశయము పనిలే దా  హరిమయము గాని ద్రవ్యము  పరమాణువు లేదు వంశపావన! వింటే.  7-275-క. (ప్రహ్లాదుని సమాధానం)  ఇందు గలఁ డందు లేఁ డని  సందేహము వలదు చక్రి సర్వోపగతుం  డెం దెందు వెదకి చూచిన  నందందే కలఁడు దానవాగ్రణి! వింటే." ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు. మొదటి దానిలో “సంశయము పనిలేదు” అంటే, రెండవదానిలో “స

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 18

ఈ భాగంలో రెండు చిన్న, చిక్కని పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాదచరిత్రలోనిది. ప్రహ్లాదుడు తోటి బాలురకు శ్రీహరిని కేవలం భక్తితోనే చిక్కించుకోవచ్చు అని చెప్తున్నాడు. రెండవది. దశమ స్కంధం పూర్వభాగంలోని బాలకృష్ణుడి లీల. బాలకృష్ణుని అల్లరికి విసిగిపోయిన యశోద, కృష్ణుడిని దొరకబుచ్చుకుంది. ఎవరికీ చిక్కని వాడు చివరికి తల్లికి చిక్కాడు! ఇంక రోటికి కట్టివేయటానికి కష్టపడుతున్నది. ఇవిగో పద్యాలు. 7-243-క.   చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ జిక్కఁడు దానముల శౌచశీలతపములం జిక్కఁడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ! 10.1-383-క.   చిక్కఁడు సిరికౌగిటిలోఁ జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం జిక్కఁడు శ్రుతిలతికావళిఁ జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్ ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు. రెండు పద్యాలలోనూ మొదటి మూడు పాదాలూ, “చిక్కడు” అనే ప్రాసతో నడుస్తున్నాయి. ఆఖరి పాదాలలో (భక్తిని) చిక్కిన / చిక్కెను (లీలన్) అంటూ ప్రాస. మొదటి పద్యంలో వాడిన “అచ్యుతుండు” అంటే జారిపోనివాడు అని అర్ధం. దీనిలో కూడా ఎంచి, తూచి వాడారు పదం. పాదాల వారీగా కూడా సామ్యం చూద

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 17

ఈ భాగంలో విశేషమైన విషము, విషయము ఉన్న పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధంలోని పూర్వ భాగంలోనివి. మొదటిది. రేపల్లెలో, పసిబాలుడైన శ్రీ కృష్ణుడిని చంపడానికి, పూతన అందమైన స్త్రీ రూపంలో వచ్చింది. చన్ను ఇచ్చిన పూతనను, గుటుక్కు మనిపించాడు శ్రీకృష్ణుడు. ఆ విషము పసిబాలుడి ఏమీ చేయలేక పోవటం పెద్దవిషయం కాదని భావన. రెండవది. గోకులం నుంచి బృందావనానికి వలస వెళ్లిన తరువాత అక్కడ కాళింది మడుగులో విషం కక్కుతున్న కాళీయూని మర్దన జరుగుతున్న సమయం. సరస్సు చూట్టూచేరిన వారు, ఆదుర్దా పడుతున్నారు. 10.1-233-క. (పూతన సంహారము)  విషధరరిపు గమనునికిని  విషగళ సఖునికిని, విమల విష శయనునికిన్,  విషభవభవ జనకునికిని,  విషకుచచను విషముఁ గొనుట విషమే తలపఁన్? 10.1-655-క. (నందుడు యశోద మొ. వారి ఆదుర్దా)  "విషకుచయుగ యగు రక్కసి  విషకుచదుగ్ధంబుఁ ద్రావి విషవిజయుఁడ వై  విషరుహలోచన! యద్భుత  విషయుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా! ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు, శ్రీకృష్ణుడి మీద విషప్రభావం గురించిన సందర్భాలు. రెండింటిలోనూ “విష” - అంటూ నానార్ధాలతో కూడిన ఏడుసార్లు ప్రాస. కాస్త గమనిస్తే మొదటి పద్యం ఎక్కడ

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 16

ఈ భాగంలో ఒకటే భావన రెండు గొంతుకలలో ఎలా పలకుతాయో చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు, తన కొడుకైన ప్రహ్లాదునికి హరిభక్తి వలదని చెప్పి గురువులతో మరల పంపించినాడు. తిరిగి వచ్చిన కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకుని, “ఏదైనా ఒక్క పద్యం, తాత్పర్యము చెప్పు కన్నతండ్రీ!” అన్నాడు. ప్రహ్లాదుడు మళ్లీ హరిభక్తి చిట్టా విప్పాడు. హరి సేవ చేయని శరీరము, ఒక శరీరమే కాదన్నాడు. రెండవది. దశమ స్కంధం ఉత్తర భాగంలోనిది. పరీక్షిత్తు మహారాజు, శుకమహర్షి చెప్పే భాగవతుల కథలు వింటున్నాడు. “ఆహా! హరి సేవ చేసే ఆ భాగవతులే భాగవతులు” అంటూ గుర్తుచేసుకుంటున్నాడు. (మరొక భక్తుని గురించి చెప్పమని అడుగుతాడు. ఫలితంగా శుకమహర్షి, కుచేలుని కథ చెప్పటానికి ఉపక్రమిస్తాడు.) 7-169-సీ.   కమలాక్షు నర్చించు కరములు కరములు- శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;  సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు- శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;  విష్ణు నాకర్ణించు వీనులు వీనులు- మధువైరిఁ దవిలిన మనము మనము;  భగవంతు వలగొను పదములు పదములు- పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;  దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ