భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 18

ఈ భాగంలో రెండు చిన్న, చిక్కని పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాదచరిత్రలోనిది. ప్రహ్లాదుడు తోటి బాలురకు శ్రీహరిని కేవలం భక్తితోనే చిక్కించుకోవచ్చు అని చెప్తున్నాడు.

రెండవది. దశమ స్కంధం పూర్వభాగంలోని బాలకృష్ణుడి లీల. బాలకృష్ణుని అల్లరికి విసిగిపోయిన యశోద, కృష్ణుడిని దొరకబుచ్చుకుంది. ఎవరికీ చిక్కని వాడు చివరికి తల్లికి చిక్కాడు! ఇంక రోటికి కట్టివేయటానికి కష్టపడుతున్నది.

ఇవిగో పద్యాలు.

7-243-క. 
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ జిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!
10.1-383-క. 
చిక్కఁడు సిరికౌగిటిలోఁ జిక్కఁడు సనకాది యోగిచిత్తాబ్జములం జిక్కఁడు శ్రుతిలతికావళిఁ జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్
ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు. రెండు పద్యాలలోనూ మొదటి మూడు పాదాలూ, “చిక్కడు” అనే ప్రాసతో నడుస్తున్నాయి. ఆఖరి పాదాలలో (భక్తిని) చిక్కిన / చిక్కెను (లీలన్) అంటూ ప్రాస. మొదటి పద్యంలో వాడిన “అచ్యుతుండు” అంటే జారిపోనివాడు అని అర్ధం. దీనిలో కూడా ఎంచి, తూచి వాడారు పదం.
పాదాల వారీగా కూడా సామ్యం చూద్దాం 1. చిక్కడు వ్రతములలో క్రతువులలో - చిక్కడు సిరికౌగిటిలో - సంపాదనలో ఉండడు 2. చిక్కడు దానములలో, తపములలో - చిక్కడు యోగుల చిత్తములకు - దానములో ఉండడు 3. చిక్కడు యుక్తిని - చిక్కడు శ్రుతి లతికావళిలో - తెలివి/చదువులలో ఉండడు 4. భక్తిని చిక్కును - లీలగా తల్లికి చిక్కెను - ప్రేమకు చిక్కును
ఇంత సూచనగా చెప్పినా సరిపోలేదు పోతనకు, మళ్లీ నాలుగు పద్యాల తరువాత, శ్రీకృష్ణుడిని రోటికి కట్టిన తరువాత, మరింత సూటిగా చెప్పలేకుండా ఉండలేక పోయినాడు. క్రింది పద్యం చూడండి.

10.1-390-క.
జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచేతం
బూని నిబద్దుం డగునే శ్రీనాథుఁడు భక్తియుతులచేతం బోలెన్?

అర్ధం - భక్తులకు పట్టుబడినట్లు భగవంతుడు జ్ఞానులకు గానీ, మునులకు గానీ, దాతలకు గానీ, యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా!

!!శ్రావణ బహుళాష్టమి శుభాకాంక్షలు!! చిక్కని భక్తి చిక్కుగాక!!

Edit: 08/16/2020 పైన చెప్పుకున్న పద్యాలకు నాంది పద్యం అని చెప్పుకోదగ్గ పద్యం, మొదటి స్కంధంలో కథా ప్రారంభంలో చెప్పబడినది. 

శ్రీమంతమై, మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ 
వినఁ గోరువారల విమలచిత్తంబులఁ జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక 
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే, మంచివారలకు నిర్మత్సరులకుఁ 
గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును దగిలి యుండుట మహాతత్త్వబుద్ధిఁ,

బరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు నడఁచి, పరమార్థభూతమై, యధిక సుఖద 
మై, సమస్తంబుఁ గాకయు, నయ్యు నుండు వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునంద.

Comments