భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 17

ఈ భాగంలో విశేషమైన విషము, విషయము ఉన్న పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధంలోని పూర్వ భాగంలోనివి.

మొదటిది. రేపల్లెలో, పసిబాలుడైన శ్రీ కృష్ణుడిని చంపడానికి, పూతన అందమైన స్త్రీ రూపంలో వచ్చింది. చన్ను ఇచ్చిన పూతనను, గుటుక్కు మనిపించాడు శ్రీకృష్ణుడు. ఆ విషము పసిబాలుడి ఏమీ చేయలేక పోవటం పెద్దవిషయం కాదని భావన.

రెండవది. గోకులం నుంచి బృందావనానికి వలస వెళ్లిన తరువాత అక్కడ కాళింది మడుగులో విషం కక్కుతున్న కాళీయూని మర్దన జరుగుతున్న సమయం. సరస్సు చూట్టూచేరిన వారు, ఆదుర్దా పడుతున్నారు.

10.1-233-క. (పూతన సంహారము) 
విషధరరిపు గమనునికిని 
విషగళ సఖునికిని, విమల విష శయనునికిన్, 
విషభవభవ జనకునికిని, 
విషకుచచను విషముఁ గొనుట విషమే తలపఁన్?

10.1-655-క. (నందుడు యశోద మొ. వారి ఆదుర్దా) 
"విషకుచయుగ యగు రక్కసి 
విషకుచదుగ్ధంబుఁ ద్రావి విషవిజయుఁడ వై 
విషరుహలోచన! యద్భుత 
విషయుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా!

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు, శ్రీకృష్ణుడి మీద విషప్రభావం గురించిన సందర్భాలు. రెండింటిలోనూ “విష” - అంటూ నానార్ధాలతో కూడిన ఏడుసార్లు ప్రాస. కాస్త గమనిస్తే మొదటి పద్యం ఎక్కడ ముగుస్తుందో రెండవ పద్యం అక్కడ నుంచి ఎత్తుకుంటున్నాడు పోతన. మొదటి దానిలో “విష కుచ చను” అంటూ ఆఖరి భాగం ఉంటే, రెండవ దానిలో “విషకుచయుగ” అంటూ మొదలు. రెండు పద్యాలనూ ఒక విధంగా లంకె వేసి ముడి వేసాడు పోతన.

మొదటి పద్యంలో మరొక విశేషమున్నది. అర్ధం చూసుకుంటే, విషధరరిప గమనునికి (గరుడవాహనుడైన వానికి - విష్ణువు), విషగళసఖునికిని (శివుని స్నేహితుడైన వానికి - విష్ణువు), విమల విష శయనునికిని (శేషతల్పంపై శయనించిన వానికి - విష్ణువు), విషభవభవ జనకునికి (బ్రహ్మ తండ్రియైన వానికి - విష్ణువు) - ఇలాగ త్రిమూర్తులను తలచుకుంటున్నాడు పోతన. శ్రీకృష్ణుడు ఆ త్రిమూర్తులకూ మూలమైన పరమాత్మయే అని సూచన. 

విషము అంటే కర్మ ఫలము అని విశేషార్ధమని, ఒక ప్రతీక అని ఒకానొక ప్రవచనంలో విన్నాను. కర్మఫలము మానవులకే కానీ, పరమాత్మకు అంటదని గూడార్ధం. అది కొంత లోతైన విషయం. నాకు పూర్తిగా పట్టుబడని విషయం.

Comments