ఎక్కడిదీ పద్యం - "మరుద్వృథా" ?
తెనాలి రామకృష్ణ సినిమాలోని ఒక ఘట్టం. శ్రీకృష్ణదేవరాయని సభకు నరసరాజు అనే కవి వచ్చి "ఘంటం ఆపకుండా వ్రాస్తా"ననే సవాలు చేస్తాడు. అప్పుడు ముక్కుతిమ్మన "మరు ద్వృథా" అంటూ ఒక పద్యం చదువుతాడు. ఈ పద్యం, ముక్కుతిమ్మన వ్రాసి పారిజాతాపహరణము కావ్యంలోనిది అని ఈ మథ్యనే తెలిసింది. మూడవ ఆశ్వాసం చివరలోని పద్యం. శ్రీకృష్ణదేవరాయలుని పొగుడుతూ సాగే పద్యం. పూర్తి పద్యం, పారిజాతాపహరణం - పంచచామరం - 3.61 మ రు ద్వృథా తటస్థ శత్రు మం డలీ గళాంతర క్ష ర న్నవాసృగాపగాభి సా రికాదృతాంబుధీ! మ రు త్పతిస్వరుక్షతిక్ర మ త్రుటత్కుభృద్వర స్ఫు ర ద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ పుం ఖితానకార్భటీ! పద్యం టీకా, తాత్పర్యము - నాగపూడి కుప్పుస్వామి పుస్తకం నుండి. -- ఈ పద్యం "నోరు తిరగని" పద్యం అనటం కన్నా "చేయి తిరగని" పద్యం అనటం సబబు. ఎందుకంటే ఈ పద్యంలో వ-వత్తు (ద్వృ, స్వ, ద్వ వగైరా), ఋ-కారం (సృ, దృ వగైరా), ఇంకా భ,ధ వగైరా వత్తులు పుష్కలంగా ఉన్నాయి. ఇటువంటివి ఘంటంతో తాళపత్రాలపైన వ్రాయటం కష్టం. ఈ ఛందస్సు కూడా ప్రత్యేకమైనదే. పంచచామరం వృత్తంలో ప్రతి రెండో అక్షరం గురువు. లఘువుకన్నా మరికొంత కష్టపడి వ్రాయవలసి ...