భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 30

29వ భాగంలో వలెనే గజేంద్రమోక్ష ఘట్టానికి, సముద్ర మథనం ఘట్టానికి సంబంధించిన మరొక రెండు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు.

మొదటిది. గజేంద్రమోక్షంలోనిది. సరస్సులోనికి దిగి, మొసలి బారిన పడిన గజేంద్రుడు తన శక్తి కొలదీ పోరాటం చేస్తున్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది వాటి పోరాటం. అమీతుమీ తేలటంలేదు. రెండూ హేమాహేమీలే. పెనుగులాడుతున్నాయి.

రెండవది. సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. శివుడు దానిని నివారించాడు. కామధేనువు, రెక్కలగుర్రం, ఐరావతం, కల్పవృక్షం వగైరా పుట్టాయి. వీటితో పాటుగా లక్ష్మీదేవి పుట్టినది. దేవతలందరిలోకీ విష్ణువును వరమాల వేసి వరించింది. ఒకరినొకరు సిగ్గుతో చూసుకోవడానికి తొందర పడుతున్నారు.

ఇవిగో పద్యాలు.

8-54-క.
కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్ 
గరికి మకరి మకరికిఁ గరి భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్


8-285-క.
హరి చూచిన సిరి చూడదు సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్
హరియును సిరియునుఁ దమలో సరిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్.

ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం. రెండూ కంద పద్యాలు. రెండూ "రి"-కార ప్రాసతో నడుస్తున్నాయి. మొదటి పద్యంలో కరి-మకరి భీకర యుద్ధం చేస్తుంటే, రెండవ దానిలో హరి-సిరి (సిరి = శ్రీ = లక్ష్మీదేవి), చక్కటి హృద్యమైన,  వివాహ సన్నివేశం. ఒకే రకమైన నడకతో భీభత్స రసాన్ని, శృంగార రసాన్ని పండించటం పోతనకే చెల్లింది.

మొదటి దానిని సర్వలఘువులతో నడిపించి రెండూ సరిసమానంగా పోరాటం చేసుకుంటున్నాయని సూచించారు. రెండవ దానిలో గమత్తు ఉంది. "చూచిన, చూడదు, చూచిన, జూడ, జూపులజూడ" - అంటూ ఇరువురు చూపుల బాణాలను వేసుకుంటున్నారన్నట్టుగా,  "మరుడు (మన్మథుడు) సందడి" చేస్తున్నాడు అంటూ సూచనగా ముగించారు. పోతన, తన మాటలతో ఆ సన్నివేశం మనకళ్లకు కట్టి, మనము కూడా చూచి తరించేటట్టు చేస్తున్నాడు.






Comments