భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 13

ద్వంద్వ శిల్పం వ్యాసాలలో 3వ, 6వ భాగాలకూ దీనికీ కొంత సామ్యమున్నది. ఆ భాగాలలో మొదటి స్కంధానికీ, దశమ స్కంధంలోని రుక్మిణీ కల్యాణ ఘట్టానికీ ముడిపెట్టాం. ఈ వ్యాసంలో కూడా అంతే. ముందుగా కథా సందర్భం.

మొదటిది. నైమిశారణ్యములో ఉన్న సూతమహాముని వద్దకు, శౌనకుడు మొదలైన మునులు వచ్చి భగవంతుని అవతారము గురించి చెప్పమని అడుగుతున్నారు. ముఖ్యంగా వసుదేవుడు, దేవకిలకు ఉదయించిన అవతారము గురించిన కథలు చెప్పమని కోరుతున్నారు.

రెండవది. రుక్మిణీదేవి, తనకు ఇష్టంలేని పెళ్లి తప్పించమని, కృష్ణుడిని వరించానని లేఖ వ్రాసింది. ఆ లేఖలోని మొదటి పద్యం.
ఎవ్వని యవతార మెల్ల భూతములకు; సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు; 
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ; సంసార బంధంబు సమసిపోవు; 
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ; భయమొంది మృత్యువు పరువువెట్టు; 
నెవ్వని పదనది నేపాఱు జలముల; సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ; 

తే. దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి 
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు 
నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ 
నిచ్చ పుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత! 

ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు 
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు 
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు 
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు 

తే. నట్టి నీ యందు నా చిత్త మనవరతము 
నచ్చి యున్నది నీ యాన నాన లేదు, 
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! 
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!

ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ సీసపద్యాలు. రెండిటిలోని నాలుగు పాదాలూ ఒకే విధంగా మొదలవుతున్నాయి. మొదటి పద్యంలో “ఎవ్వని” అంటూ ఎత్తుకుంటే, రెండవ దానిలో “ఏ నీ” అంటూ ఎత్తుగడ. అంతే కాకుండా మొదటి పద్యంలో భగవంతుని వలన జరుగు విషయముల ప్రస్తావన ఉంది. రెండవ పద్యంలో ఆ విషయములన్నీ కృష్ణుని వలన రుక్మిణీదేవి తనకు జరుగవలెనని కోరుకుంటోంది.

ఇవిగో ఆ విషయములు వరుసగా : 
(మునులు) ఎవని వలన అన్ని భూతములకూ సుఖము వృద్ధి కలుగును 
(మునులు) ఎవని నామము వలన సంసార బంధనములు పోవును
(మునులు) ఎవని చరితము వలన మృత్యువు పరుగుపెట్టును 
(మునులు) ఎవని పాద జలముల వలన నిర్మలమైన సిద్ధి కలుగును 
(మునులు) ఎవని పాదముల వలన శాంతి కలుగును

(రుక్మిణి) నీ గుణములు విన్నంత మాత్రమున శరీర కష్టములు తీరిపోతాయి 
(రుక్మిణి) నీ రూపము చూచినంత మాత్రమున అనంతమైన సుఖములు కలుగుతాయి 
(రుక్మిణి) నీ చరణముల సేవ వలన భూమి మీద సౌఖ్యము పొందగలము 
(రుక్మిణి) నీ నామ జపము వలన బంధనాలు తెగిపోతాయి 

చివరిలో కూడా, ఒకటి “చరిత” అంటూ ముగిస్తే, రెండవది “చిత్తచోర” అంటూ పూర్తయింది. వాటిలోని శబ్దసామ్యాన్ని గమనించవచ్చు. మొదటి స్కంధంలో “ఎవరు ఎవరు” అని ప్రశ్నించి, దశమ స్కంధంలో అది కృష్ణుడే అని పోతన రుక్మిణీదేవి ద్వారా మనకు సూచిస్తున్నాడు.

-- 
ఇంకా అర్ధం చేసుకోవాలంటే, “ఎవడు కొడితే దిమ్మి తిరిగి మైండు బ్లాక్ అవుతుందో - వాడే పండుగాడు” - “పోకిరి” సినిమాలోని సగం ప్రశ్న - సగం జవాబు డైలాగు గుర్తుకువస్తే పోతన చేయాలనుకున్నది అర్ధమవుతుంది. చాలా యుగళ గీతాలలో ఒకరు “అది ఎవరు, ఇది ఎవరు” అని మొదటి చరణంలో ప్రశ్నించటం, మరొకరు “అది నీవే, ఇది నీవే” అంటూ మరొక చరణంలో జవాబు పాడటం వింటూంటాం.

Comments