భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 12

చిన్న ఉపోద్ఘాతం. 1997/98 నాటి విషయం. పైచదువులకోసం భారతదేశం నుండి వచ్చిన క్రొత్తలు. ఒక స్నేహితుడు “Thesis defense” చేస్తున్నాడని, తోటివారమంతా వెళ్లాం. అతను మొదలు పెట్టిన రెండో నిమిషంలో ఒక ప్రొఫెసరు ఆపి, “What is your Thesis?” అని అడిగారు. తను థీసిస్ యొక్క శీర్షిక (Title) చెప్పాడు. అప్పుడు ఆ ప్రొఫెసరు, “That is title. I want to know what your Thesis is.” అన్నారు. తనతో పాటు, మేమందరం కూడా బిక్కముఖం వేశాం. అప్పుడు ఆయనే వివరించారు. Thesis అంటే ప్రతిపాదన. నువ్వేమి ప్రతిపాదిస్తున్నావు. దానిని రెండుముక్కలలో ముందు చెప్పు తరువాతదంతా దాని గురించిన వివరణ, సమర్ధన (defense). వ్రాసినప్పుడు కూడా చెప్పాలనుకున్న విషయాన్ని సంక్షిప్తంగా (abstract) చెబుతాము కదా. ఎందుకో ఆయన చెప్పినది నా మనసులో ఉండిపోయింది.

భాగవతం కూడా ఆ దృష్టితో చూస్తే, పోతన తన మొదటి పద్యం ఒక ప్రతిపాదనా పద్యంలాగా కనబడుతుంది. అయితే దేని గురించి ప్రతిపాదన చేస్తున్నారు? భగవంతుని తత్వం గురించి ప్రతిపాదన. ఇదిగో భాగవతంలోని మొట్టమొదటి పద్యం. లంకె మీద నొక్కితే లోతైన వివరణ ఉన్నది.

1-1-శా. (ప్రతిపాదనా పద్యం) శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

పద్యం మొత్తం వివరించి చెప్పాలంటే భాగవతం మొత్తం చెప్పాలి కదా. అందుకని దానిలోని ఒక్క పదబంధం తీసుకుని చూద్దాం. “భక్త పాలన కళా సంరంభకున్” - “భక్తులను రక్షించుట అనే కార్యంకోసం హుటాహుటిన వచ్చేవాడు” అని అర్ధం. దీనిలో కూడా “సంరంభం” అనే పదము ముఖ్యము. దీనిని భాగవత కర్త ఎలా చూపించారో చూద్దాం.

ముందుగా భక్తులను రక్షించే కథలు, నాలుగు.

  1. మొదటి స్కంధం. మహాభారత యుద్ధానంతరం అశ్వద్థామ ప్రయెగించిన బ్రహ్మాస్త్రాన్ని ఆపి పరీక్షిత్తును హుటాహుటిన రక్షించ వచ్చిన కృష్ణుడు.
  2. ఏడవ స్కంధం. “ఏక్కడరా హరి? ఈ స్తంభంలో ఉన్నాడా?” అని ప్రశ్నించిన హిరణ్యకశిపునికి, ప్రహ్లాదుడు “కలడు” అని జవాబు చెప్పినప్పుడు దానిలోనుంచి ఉద్భవించిన నారసింహుడు.
  3. ఎనిదవ స్కంధం. మొసలి బారిన పడిన గజేంద్రుని మొర విని హూటాహుటిన బయలుదేరిన విష్ణువు.
  4. ఎనిదవ స్కంధం. సముద్ర మథనంలో హాలాహలం పుట్టింది. అందరూ శివుని వద్దకు వెళ్లి త్వరితంగా రక్షించమని వేడుకుంటున్నారు.

ఇవిగో ఆ పద్యాలు.
1-286-సీ. (కృష్ణుడు పరీక్షిత్తును రక్షించుట) 
మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని; పై నున్న పచ్చని పటమువాఁడు; 
గండభాగంబులఁ గాంచన మణి మయ; మకరకుండలకాంతి మలయువాఁడు; 
శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి; కన్నుల నునుఁ గెంపు కలుగువాఁడు; 
బాలార్కమండల ప్రతిమాన రత్న హా;టక విరాజిత కిరీటంబువాఁడు;

కంకణాంగద వనమాలికా విరాజమానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ 
డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు.

7-284-మ. (నారసింహ అవతారము) 
"వినరా డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం 
డని భాషించెద; వైన నిందుఁ గలఁడే" యంచున్ మదోద్రేకియై 
దనుజేంద్రుం డరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభా శుంభమున్ 
జనదృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్.

8-95-మ. (విష్ణువు) 
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా 
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో 
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి 
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

8-219-మ. (శివుని రక్షించమని కోరుట) 
చని కైలాసముఁ జొచ్చి శంకరుని వాసద్వారముం జేరి యీ 
శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి "కుయ్యో! మొఱో! 
విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు" మం చంబుజా 
సనముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.

ద్వంద్వ శిల్పం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మూడు పద్యాలు మత్తేభాలు. అన్నింటిలోనూ మొట్టమొదటి పద్యంలో చెప్పిన “సంరంభం” అనే ప్రతిపాదనను వివరించడానికి, అదే పదాన్ని యధాతధంగా (verbatim) వాడి చూపించారు. అవతారము ఏదైనా, మనము ఏ రూపంలో భావించితే ఆయా రూపాలలో సాక్షాత్కరిస్తాడని మరలమరల వివరిస్తున్నాడు పోతన.

పోతన వ్రాసిన ఆంధ్రమహాభాగవతమంటే పురాణగాధల ద్వారా, రసాత్మక కావ్య గుబాళింపులతో, భగవంతుని తత్వం గురించిన ప్రతిపాదన, ఆవిష్కరణ, వివరణ.

Comments