భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 8

ఈ భాగంలో రెండు బ్రతిమాలే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సన్నివేశాలు.

మొదటిది, సప్తమ స్కందం, ప్రహ్లాదచరితం ఘట్టంలోనిది. హిరణ్యకశిపుడు కొడుకుకు, రాచరిక విద్యలను నేర్పమని గురువులకి అప్పగించాడు. ప్రహ్లాదుడు ఇంటికి వచ్చి విష్ణువు గురించి చెప్పనారంభించాడు. హిరణ్యకశిపుడు ఆ మాటలకు కోపించాడు. గురువులు క్షమాపణలు చెప్పి, ప్రహ్లాదుడిని మళ్లీ తీసుకుని వెళ్లి, ధర్మార్ధకామ (త్రివర్గ) శాస్త్రాలలో శిక్షణ ఇచ్చి పట్టుకొచ్చారు. తండ్రి ముందు ఏమి మాట్లాడి తమ కొంప ముంచుతాడో అని భయపడుతున్నారు. ప్రహ్లాదుడిని విష్ణువు (మోక్షం) మాట ఎత్తవద్దని బ్రతిమాలుతున్నారు.

రెండవది దశమస్కందం పూర్వభాగంలోనిది. కంసుడు ఆకాశవాణి మాటలు విని రథాన్ని ఆపాడు. తోడబుట్టిన చెల్లెలని కూడా ఆలోచించకుండా దేవకి మీదకు కత్తిని దూసాడు. వసుదేవుడు కంసుని బ్రతిమాలుతున్నాడు.
ఇవిగో ఆ పద్యాలు. 

7-158-ఉ. 
"త్రిప్పకు మన్న మా మతము, దీర్ఘములైన త్రివర్గపాఠముల్
దప్పకు మన్న, నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్
చెప్పినరీతి గాని మఱి చెప్పకు మన్న విరోధిశాస్త్రముల్,
విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్."
10.1-26-ఉ.
"అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో?
మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?
"మిన్నుల మ్రోతలే నిజము, మే"లని చంపకు మన్న! మాని రా
వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్.

ఇక ద్వంద్వ శిల్పంలోనికి వెడితే, రెండూ ఉత్పలమాలలో వచ్చిన బ్రతిమాలే పద్యాలు. రెండిటిలోనూ గమనించాల్సినది “అన్న” అనే వాడుక. ప్రహ్లాదుడిని బ్రతిమాలే సందర్భంలో “త్రిప్పకుమన్న, దప్పకు మన్న, చెప్పకు మన్న, విప్పకు మన్న” అని వస్తుంది. ఇక్కడ అన్న అంటే నాయనా అనే వాత్సల్యం కనిపిస్తుంది. అలాగా “మన్న” అంటే మా మాటను “మన్నించు” నాయనా అనే భావన వినిపిస్తుంది.
రెండవ పద్యం చూస్తే, చెల్లెలి తరపున కంసుని బ్రతిమాలుతూ, ఒక అన్నగారి బాధ్యతను, బంధాన్ని గుర్తుచేస్తున్నాడు. ఎత్తుకోవడమే, “అన్నవు నీవు చెల్లెలికి” అన్నాడు. ఇంక, “మన్నన, చంపకు మన్న, రావన్న, సహింపు మన్న, తగదన్న, వధింపకు మన్న” అంటూ “అన్న” బంధుత్వాన్ని పదేపదే గుర్తుచేస్తూ, “నాయనా” అంటూ బ్రతిమాలుతూ, “మన్నన” కోరుతూ వసుదేవుడు కనిపిస్తాడు. ఈ పద్యం చాగంటి వారి ప్రవచనాలలో వినిపిస్తూ ఉంటుంది.
నాన్న, అన్న, అయ్య, అమ్మ - అనే పదాలు తెలుగులో కేవలం ఒక తండ్రి, సోదరుడు, తల్లి అనే బంధాన్నే కాక ఏదైనా అనుబంధాన్ని, ఆత్మీయభావం చూపాల్సినప్పుడు కూడా తరచూ వాడుతూ ఉంటాము. మన రాజకీయనాయకులు, సినిమా హీరోలు కూడా - అన్న, చంద్రన్న, రాజన్న, జగనన్న, ఇందిరమ్మ - అని పిలిపించుకోవడం తెలిసిన విషయమే కదా.
చివరిగా, తెలుగులోని నానార్థాలను, పర్యాయపదాలను వాడుతూ శబ్దరమ్యతనూ, శబ్దసామ్యతనూ ఆవిష్కరించాలంటే పోతన ముందుంటాడు. అందరికీ తెలిసిన విషయమే అయినా మరొక్కసారి అనుకుంటే అదొక తృప్తి.Update 05/17/2020 ఇటువంటివే మరొక రెండు పద్యాలు.
  10.1-150-ఉ. [దేవకి తన ఎనిమిదవ సంతానమైన ఆడపిల్లను చంపవద్దని కంసుని వేడుట] "అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
 మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.

10.1-259-ఆ [శకటాసురుని (బండి) సంహరించిన పసిబాలుని ఎత్తుకొని యశోద అనునయిస్తున్నది.]
"అలసితివి గదన్న! యాకొంటివి గదన్న! మంచి యన్న! యేడ్పు మాను మన్న!
చన్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!" యనుచుఁ జన్నుఁగుడిపె నర్భకునకు.

Comments