భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 3

పోతనకు శబ్దాలంకార ప్రియుడని పేరు ఉంది. శబ్దాన్ని ఎలా వాడుకోవాలో తనకు బాగా తెలుసును. ఈ వ్యాసంలో “ణ” శబ్దాన్ని వాడతూ ద్వంద్వ శిల్పం నిర్మించారో చూద్దాం. “ణ”కారంలో ఒక సొగసు ఉంది. “గుడిలో గంటలు ఎలా మ్రోగుతాయి?” అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? “గణ గణ” మ్రోగుతాయి అంటాం. వాటిని మంగళకరమైన శబ్దంగా భావిస్తాం.

పోతన భాగవతం మొదలు పెట్టాడు. ఇష్టదేవతా స్తుతి చేసాడు. వ్రాయించేది శ్రీరాముడన్నాడు. కథ మొదవలబోతోంది. శౌనకాది మునులతో ఉత్సాహంగా “గంట” కొట్టించేడు - “ణ”కారంతో ఒక పద్యం వచ్చింది - భూషణములు, అఘపేషణములు, భీషణములు, తోషణములు, విశేషణములు అంటూ “గణగణ”లాడించాడు. దానికి తోడు శ్రీకృష్ణుడులో కూడా “ణ”కారం ఉన్నది కదా.
భూషణములు వాణికి నఘపేషణములు మృత్యుచిత్త భీషణములు హృ 
త్తోషణములు కల్యాణ విశేషణములు హరి గుణోపచితభాషణముల్.
 

పోతన వ్రాస్తూపోతున్నాడు. తొమ్మిది స్కంధాలు అయిపోయాయి. దశమ స్కంధం మొదలయింది. దశమ స్కంధం, రెండు భాగాలు - పూర్వ భాగంలో శ్రీకృష్ణుడు బ్రహ్మచారి, ఉత్తరభాగంలో సంసారి. పూర్వభాగంలో శ్రీకృష్ణ జననం, మధుర లీలలు, కంస వధ అయిపోయినాయి. యవ్వన దశవచ్చింది. ఇంక “రుక్మిణీకల్యాణం” ఘట్టంతో పూర్తిచేయాలి. అప్పటివరకూ ఒంటరిగా ఉన్న శ్రీకృష్ణుడిని “పూర్ణం” చేయాలి. పతాక సన్నివేశం. రసవత్తరమైన ఆ ఘట్టం మొదలులో పోతనకు కొత్త ఉత్సాహం వచ్చింది. మరి “రుక్మిణి”లో కూడా మరో “ణ”కారమున్నది కదా. మళ్లీ పరీక్షిత్తు మహారాజుతో “గంట” కొట్టించేడు పోతన. “ణ”కారంతో మరో పద్యం వచ్చింది.
భూషణములు చెవులకు బుధతోషణము లనేక జన్మదురితౌఘ విని 
శ్శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్ 

ఇప్పటికే పోతన ద్వంద్వ శిల్పం అర్ధమయి ఉంటుంది. రెండూ కంద పద్యాలు. గమనించాల్సిన విషయం ఇంకోటుంది. మొదటి పద్యంలో “కల్యాణ విశేషణములు” కాస్తా రెండవ పద్యంలో “మంగళతర ఘోషణములు”గా వచ్చింది. రెండు పద్యాలు “భూషణములు” పదముతో మొదలు, “భాషణముల్”తో ముగుస్తున్నాయి. శ్రీకృష్ణుడు, రుక్మిణి గుండెలలో వీణానాదాలు, గంటలు మ్రోగించాడు.

మొదట వ్రాసిన పద్యానికి, రెండవ పద్యానికి మధ్యలో వేలపద్యాలున్నాయి. అయినా పోతన రెండవ పద్యం కోసం మొదట్లోనే విత్తువేసాడు అనిపిస్తుంది. భాగవతం లోకకల్యాణం, మంగళతరం అంటూ చాటాడు. అంతా ప్రయత్నపూర్వకంగా చేసినదే.

చివరగా ఒక మాట. జీవాత్మ, పరమాత్మ వంటి వాటికి పోనక్కరలేదు. భాగవతాన్ని, కేవలం ఒక పుస్తకంగా, కథలుగా, కథనంగా చూసినా కూడా చాలు. ధన్యులమవుతాము.

Comments